లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. కంటైన్ మెంట్ జోన్లకు వెలుపల ఉన్న సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ కార్యాలయాలన్నీ తెరవాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో నేటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే ప్రజలు విధిగా కరోనా కట్టడికి జాగ్రత్తలనుపాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్యాలయాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ఉద్యోగులు, ఇక్కడికి వచ్చేవారు సామాజిక దూరం పాటించడం తప్పనిసరిగా పేర్కొంది. కార్యాలయంలో పది మంది కంటే ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఉద్యోగుల హాజరు నిమిత్తం ఉపయోగించే బయోమెట్రిక్ యంత్రాలను నిత్యం శానిటైజ్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

