టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై నమోదైన ఫోర్జరీ కేసు కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేసి రవిప్రకాశ్ ను కొన్నిరోజులపాటు విచారించారు. ఈ రోజు హైకోర్టులో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పై వాదనలు కొనసాగాయి. ఈ కేసు పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదావేసింది.
ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, రవిప్రకాశే నటుడు శివాజీతో ఎన్సీఎల్టీలో కేసులు దాఖలు చేయించాడని ఆరోపించారు. రవిప్రకాశ్ నుంచి శివాజీ ఎలాంటి షేర్లను కొనుగోలుచేయలేదని కూడా స్పష్టం చేశారు. 40,000 షేర్లను రూ.20 లక్షలకు విక్రయించి ఉంటే ఆ లావాదేవీల వివరాలను ఐటీ విభాగానికి ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు.సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది.