ఇటీవల ఎన్నికల తరువాత రాహుల్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ అయితే రోజు ఏదోఒకదానిపై రాహుల్ ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఇన్నిటికి సమాధానంగా రాహుల్ ఏఐసీసీ కి రాజీనామా చేసినా కూడా ఇవన్నీ కొనసాగుతూనే ఉండటం విశేషం. వాటిపై ఆయన స్పందిస్తూ, తనపై ఎంత తీవ్రంగా దాడి చేసినా, అంత ప్రేమగా ఎదుర్కొంటానని, సత్యమార్గాన్ని మాత్రం వీడేది లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
నేడు క్రిమినల్ పరువు నష్టం కేసులో అహ్మదాబాద్ కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ, దేశ భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానన్నారు. నిజాయితీయే తమ బలమని, అదే తమ పార్టీని పటిష్ఠపరుస్తుందని తెలిపారు. అవసరమనుకున్న చోటల్లా డబ్బును వెదజల్లి ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని, ఇప్పటి వరకూ, గోవా, ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించిన బీజేపీ తాజాగా కర్ణాటకపై దృష్టి పెట్టిందన్నారు. డబ్బు, అధికారాన్ని ప్రయోగించి ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని, ఇదే వాస్తవమని రాహుల్ స్పష్టం చేశారు.