జమ్మూకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలు శ్రీనగర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిని అక్కడి పోలీసు అధికారులు అడ్డుకొని, తిరిగి వెనక్కి పంపారు. ఇక్కడ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని చెప్పి వారిని తిప్పి పంపారు. రాహుల్ వెంట సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, టీఎంసీ నేత దినేశ్ త్రివేది, డీఎంకే నేత తిరుచ్చి శివ తదితరులు ఉన్నారు.
వీరంతా శ్రీనగర్ కు బయల్దేరక ముందే వీరిని ఉద్దేశించి జమ్మూకశ్మీర్ సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు ట్వీట్ చేశారు. ఇక్కడకు రావద్దని, ప్రజలను అసౌకర్యానికి గురి చేయవద్దని ట్విట్టర్ ద్వారా కోరారు. ఉగ్రవాదుల నుంచి జమ్మూకశ్మీర్ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని తెలిపారు.