telugu navyamedia
సినిమా వార్తలు

మాధవన్ తనయుడి ఘనత… స్విమ్మింగ్ లో ఇండియాకు రజతం

R-Madhavan

ప్రముఖ తమిళ హీరో మాధ‌వన్ ప్ర‌స్తుతం ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వ‌యంగా తెర‌కెక్కిస్తూ న‌టిస్తున్నాడు మాడి. “రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్‌” అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్ర‌ధాన కోణాల‌ని చూపించనున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా షారూఖ్, సూర్య ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక మాధ‌వ‌న్ భార్య‌గా సిమ్రాన్ క‌నిపించ‌నున్నారు. కాగా… త‌న‌యుడు సాధిస్తున్న ఘ‌న‌త‌ల‌ని చూసి తండ్రి మాధ‌వ‌న్ చాలా గ‌ర్విస్తున్నాడు. మాధవన్-సరితల పుత్ర రత్నం వేదాంత్ (14) ఆ మ‌ధ్య థాయిలాండ్‌లో జరిగిన‌ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో … 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడ్డాడు. మూడో స్థానంలో నిలిచిన వేదాంత్ కాంస్యపతకం అందుకున్నాడు. ఇక రీసెంట్‌గా జాతీయ స్థాయి పోటీలు జ‌ర‌గ‌గా అందులో వేదాంత్ మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ విష‌యాల‌ని గ‌ర్విస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌కి తెలియ‌జేశాడు మాధ‌వ‌న్.

తాజాగా జ‌రిగిన ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌ గ్రూప్ IIలో 4×100 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత్ తరుపున వేదాంత్‌తో పాటు మరో ముగ్గురు పోటీలో పాల్గొన్నారు. వేదాంత్‌ (55.27 సె), ఉత్కర్ష్‌ పాటిల్‌ (57.10 సె), సాహిల్‌ లష్కర్‌ (54.83 సె), సోహన్‌ గంగూలీ (54.29 సె)తో కూడిన బృందం 3:41:49 సెకన్లలో పోటీ ముగించి రెండో స్థానం పొందారు. ఇందుకు గాను వారికి సిల్వ‌ర్ మెడ‌ల్ ద‌క్కింది. గ్రూప్ IIలో 4×100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో తొలి స్థానంలో నిలిచిన థాయిలాండ్ స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించగా… మూడో స్థానంలో నిలిచిన జపాన్ స్విమ్మర్లు కాంస్య పతకం సాధించారు. ఇదిలా ఉంటే, గ్రూప్ Iలో 4×100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించారు. మొత్తానికి వేదాంత్ త‌న తండ్రితో పాటు దేశాన్నీ గర్వపడేలా చేశాడు. భార‌త్ త‌ర‌పున తొలి ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌ గ్రూప్ II పోటీల‌లో భార‌త్‌కి ర‌జతం ల‌భించింది అని మాధ‌వన్ త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలియ‌జేశాడు. ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు వేదాంత్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు

Related posts