స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో తెలుగుతేజం పీవీ సింధూ విజేతగా నిలిచింది. ఆదివారం జరగిన ఫైనల్లో జపాన్ పై వరుస సెట్లలో విజయంతో ప్రపంచ మహిళా సింగిల్స్ ఛాంపియన్గా పీవీ సింధూ నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఒకుహరను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తాను సాధించిన చారిత్రక విజయాన్ని తన తల్లి పీ విజయ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇప్పటివరకు మరే భారత షట్లర్ కు సాధ్యం కాని రీతిలో సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలవడంతో ఆమె కుటుంబం ఆనందంతో పొంగిపోతోంది. సింధు గెలుపు క్షణాలను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కుటుంబ సభ్యులు టీవీలో వీక్షించారు. సింధు తల్లి విజయ మాట్లాడుతూ ప్రతిసారి తన బర్త్ డే సందర్భంగా సింధు ఏదో ఒక కానుక ఇచ్చేదని, ఈసారి తనకు, దేశానికి ఏకంగా ప్రపంచ టైటిల్ నే బహుమతిగా ఇచ్చిందని మురిసిపోయారు. కాగా తన కుమార్తె సాధించిన చారిత్రక విజయం తమకు గర్వకారణమని సింధూ తల్లి విజయ తన సంతోషం పంచుకున్నారు.