కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోతున్నప్పటికీ ప్రభుత్వం దాని నివారణకు పరిష్కార మార్గాలు చూపకపోవడం శోచనీయం అంటూ ఎన్డీయే ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుత దేశ ఆర్థిక స్థితిపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో గురవారం స్పందించారు. ‘ దేశ ఆర్థిక స్థితి మందగమనంగా ఉందని వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం తరఫు నుంచి ఈ అంశంపై స్పందనే లేదు. ఈ రెండు పరిణామాలు అత్యంత ప్రమాదకరం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పరిష్కార మార్గాలు చూపాలి. కానీ వారు మాత్రం కుంటి సాకులు చెప్తున్నారు. అర్థంలేని పుకార్లు వ్యాప్తి చేయడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదని ఇప్పటికైనా వారు తెలుసుకోవాలి’ అంటూ భాజపాను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా హిందీలో రాసుకొచ్చారు. దాంతో పాటు ఎన్నో ప్రోత్సాహాకాలు కల్పించినప్పటికీ వాణిజ్య వాహన అమ్మకాల క్షీణతను సూచిస్తున్న ఒక మీడియా రిపోర్ట్ను కూడా దానికి జతచేశారు.