అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో శుక్రవారం ఉదయం విందు కార్యక్రమంతో తానా మహాసభలను అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికా నలుమూలల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి 12 వేల మంది ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరవుతారని అంచనా. ఈ వేడుకలో వివిధ రంగాల్లో అద్భుతప్రతిభ కనబరిచిన ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తానా వేదికగా పలు విషయాలపై ప్రస్తావించిన పవన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటమిపై కూడా స్పందించారు. “అపజయానికి ఎప్పుడు నేను భయపడను. సినిమాలలో ఉన్నప్పుడు ఖుషీ తర్వాత చాలా ఫ్లాప్స్ వచ్చాయి. గబ్బర్ సింగ్ చిత్రంతో మంచి విజయాన్ని పొందాను. దాని కోసం చాలా సహనంతో ఓపికగా ఎదురు చూసాను. అలానే రాజకీయాలలోను ఏదో ఒక రోజు గెలుపొందుతాను. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోతాను అనే విషయం ముందే తెలుసు. సంపూర్ణంగా ఓడిపోయి, అర్ధం చేసుకొని బయటకి రావడానికి నాకు 15 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. 15 నిమిషాలు నా అపజయాన్ని నేను ఒప్పుకొన్నాను. సక్సెస్ కన్నా ఓటమి మాత్రమే నాకు పాఠాలు ఎక్కువ నేర్పింది. ఖుషీ 100 డేస్ ఫంక్షన్లో సమాజం కోసం ఏదైన చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుండి సినిమాలపై ఆసక్తి తగ్గింది. సమాజానికి ఏదో చేయాలని నిర్ణయించుకున్నాను. అదే మీ ముందుకు జనసేన రూపంలో వచ్చింది” అని పవన్ పేర్కొన్నాడు.
రెండోరోజు కాకినాడ శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద, విశ్వయోగి విశ్వంజీల ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు. 5, 6 తేదీల్లో వాణిజ్య, మహిళా, యువజన సదస్సులు నిర్వహిస్తారు. ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన శ్రీకృష్ణరాయభారం నాటకాన్ని అమెరికాలో నివసిస్తున్న తెలుగు బాలబాలికలు ప్రదర్శిస్తారు. ఈ మహాసభల్లో ముఖ్య అతిథులుగా బీజేపీ నేత రాంమాధవ్, సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు కపిల్ దేవ్ పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గురువారమే అమెరికాకు చేరుకున్నారు. తానా అధ్యక్షుడు వేమన సతీశ్, ఇతర పాలకవర్గ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. సినీ ప్రముఖులు అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, జొన్నవిత్తుల, గాయని సునీత, రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పారిశ్రామికవేత్త ఎల్లా కృష్ణ, ప్రముఖ అవధాన పండితుడు మేడసాని మోహన్, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాసగౌడ్ హాజరవుతున్నారు. ప్రముఖ సినీనటులు పూజా హెగ్డే, జగపతిబాబుఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.