telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మిర్చి” కాంబో మళ్లీ రిలీట్‌..!

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్‌తో చేయనున్న ఆదిపురుష్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటంతో ప్రభాస్ లేకుండానే ఓంరౌత్ ఆదిపురుష్‌ను మొదలు చేయనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ప్రభాస్ లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొననున్నాడు. దీంతో అతి త్వరలో ఆదిపురుష్ చిత్రీకరణను ప్రారంభించనుంది. అయితే ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఇది ఇలా ఉండగా.. సినీజనం అప్పుడే ఆయన 25వ చిత్రంపై గురి పెట్టారు. ప్రభాస్ 25వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తారనీ ప్రచారం సాగుతోంది. ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ రానేలేదు. అప్పుడే ఆయన 25వ సినిమా ముచ్చట సాగుతోంది. అందుకు ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణమని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా రూపొందిన ‘మిర్చి’ సినిమాతోనే కొరటాల శివ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచీ ఇప్పటిదాకా కొరటాల దర్శకత్వంలో రూపొందిన నాలుగు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం చిరంజీవితో కొరటాల శివ ‘ఆచార్య’ తెరకెక్కిస్తున్నారు. ఈ యేడాది మే 13న ‘ఆచార్య’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొరటాల తదుపరి చిత్రం ఏది అన్న ప్రశ్న తలెత్తక మానదు. అది ప్రభాస్ 25వ చిత్రం అని వినికిడి. ఈ లోగా కొరటాల మరో హీరోతో సినిమా తీసినా, తీయవచ్చు. ఎందుకంటే 2022 వరకు ప్రభాస్ ఖాళీగా లేరు. అయినా ఇప్పుడు వినిపిస్తున్న మాటనే నిజమై ప్రభాస్ 25వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తారేమో చూడాలి.

Related posts