కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమై తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆరోపిస్తూ జాలర్లు చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరిన నేపథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమస్య పరిష్కారానికి కీలక చర్యలు చేపట్టారు.
ఈ విషయంపై సమగ్ర అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు సూచించేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
బుధవారం ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను నేరుగా రాలేకపోతున్నప్పటికీ, మత్స్యకారుల సమస్యలను సోమవారం నుంచే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నానని తెలిపారు.
ఫార్మా పరిశ్రమల వల్ల జాలర్ల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, వారి ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.
సమస్య పరిష్కారం కోసం కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, మత్స్య, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఈ కమిటీ కేవలం సమస్యల పరిష్కారానికే కాకుండా, తీరప్రాంత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, జాలర్ల జీవనోపాధి మెరుగుపరచడం, నష్టపరిహారం అంచనా వంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తుందని వివరించారు.
కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా తక్షణమే చేపట్టాల్సిన చర్యలను ఇప్పటికే గుర్తించామని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద మరణించిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు బీమా మొత్తాలు, దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అలాగే, మచిలీపట్నం, అంతర్వేది వంటి ప్రాంతాల్లో మత్స్యకారులకు వేట అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే తాను స్వయంగా ఉప్పాడ వచ్చి మత్స్యకారులతో కూర్చుని అన్ని విషయాలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు.
మరోవైపు, బుధవారం కూడా ఉప్పాడలో వందలాది మంది మత్స్యకారులు తమ కుటుంబాలతో కలిసి ధర్నా కొనసాగించారు. ఉప్పాడ-కాకినాడ-పిఠాపురం రహదారిపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలిపారు.
ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగిలి నిరసన స్థలాన్ని సందర్శించి, మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఏర్పాటు చేయబోయే కమిటీలో మత్స్యకార ప్రతినిధులకు చోటు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జగన్ సుపరిపాలన అందించడం ఖాయం : లక్ష్మీపార్వతి