సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రజినీకాంత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
అలాగే పలువురు రాజకీయనాయకులు కూడా రజినీకి అభినందనలు తెలుపుతున్నారు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి మోడీ సూపర్ స్టార్ కు సోషల్ మీడియా వేదికగా అభినందలు తెలిపారు.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రజినీకాంత్ కు అభినందనలు తెలిపారు.
” వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజిని’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాను.
తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదు.
ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు శ్రీ రజినీకాంత్ గారు నటుడిగా అయిదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ శ్రీ రజినీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
“నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ప్రతినాయక పాత్ర పోషించినా, కథానాయకుడిగా మెప్పించినా శ్రీ రజినీకాంత్ గారు తనదైన స్టైల్ ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
ఆయన నడకలో, సంభాషణలు పలకడంలో, హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారు. శ్రీ రజినీకాంత్ గారి స్టైల్స్ కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారు.
నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన శ్రీ రజినీకాంత్ గారు మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియచేస్తుంది.
నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న శ్రీ రజినీకాంత్ గారు మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నాను.
శ్రీ రజినీకాంత్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు.