లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పోలీసు వ్యాన్ సైరన్ విని భయంతో పరుగులు పెట్టిన ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పాలకొల్లులోని లజపతిరాయ్పేటలో నిన్న ఉదయం జనం పెద్ద సంఖ్యలో గుమికూడారు.
అదే సమయంలో పోలీసులు వస్తున్నట్టు సైరన్ రావడంతో వారికి దొరక్కుండా ఉండేందుకు తలా ఓ దిక్కుకు పరుగులు తీశారు.ఈ క్రమంలో పట్టణానికి చెందిన వేండ్ర వీరాంజనేయులు (57) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. చింతలపూడి మండలం వెంకటాపురంలో జరిగిన మరో ఘటనలో పసుమర్తి భాస్కరరావు (55) పోలీసు వ్యాన్ సైరన్ విని తప్పించుకునేందుకు పరుగులు పెడుతూ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు తెలిపారు.
బొత్స తానే సీఎంలా మాట్లాడుతున్నారు: పవన్ విమర్శలు