పంటలు సాగు చేసే విధానంపై ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులతో కేసీఆర్ ముఖాముఖి నిర్వహించారు. ఇప్పటివరకు రైతులు మూసపద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా ఎంతో నష్టపోయారని, ఇకపై అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిందని అన్నారు.
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, నేల రకాలను పరిగణనలోకి తీసుకుని ఏ సీజన్ లో ఏం పండించాలి, ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలనే విషయాలను శాస్త్రవేత్తలు నిర్ణయించారని తెలిపారు. తెలంగాణ రైతులు ప్రపంచంతో పోటీ పడే రైతాంగంలా మారాలి. రాష్ట్ర జీవికలో వ్యవసాయం ప్రధాన భాగం. వ్యవసాయ భవితం ఉజ్వలంగా ఉండాలని అన్నారు. ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తులు అందించి లాభాలు గడించాలని చెప్పారు. ఇక ప్రభుత్వం సూచించిన మేరకు పంటలు పండిస్తే రైతులు నష్టపోయే అవకాశమే ఉండదని స్పష్టం చేశారు.