ప్రపంచ కప్ లో భాగంగా బర్మింగ్హామ్లో పాక్-న్యూజిలాండ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో పాక్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి, ప్రపంచ కప్ లో ఓటమి అనేది లేకుండా దూసుకెళ్తున్న న్యూజిలాండ్ కు అడ్డుకట్టవేసింది. బాబర్ ఆజం అజేయ సెంచరీతో మెరవడంతో 238 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఏడు మ్యాచ్లు ఆడిన కివీస్కు ఇది తొలి ఓటమి. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్.. భారత్తో ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. కివీస్తో మ్యాచ్లో తొలుత బౌలింగ్లో రాణించిన సర్ఫరాజ్ సేన.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ సత్తా చాటింది. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆడిన ప్రతీ మ్యాచ్ను గెలవక తప్పని పరిస్థితుల్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది.
కివీస్ నిర్దేశించిన 238 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. బాబర్ ఆజం (101) అజేయ సెంచరీకి తోడు హరీస్ సోహైల్ (68) మరోమారు సత్తా చాటడంతో 49.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెంచరీ వీరుడు బాబర్ ఆజంకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ షహీన్ అఫ్రిది దెబ్బకు 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు మాత్రమే చేసింది. పది ఓవర్లు వేసిన షహీన్ 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఆటగాళ్లలో జేమ్స్ నీషమ్ (97 నాటౌట్), గ్రాండ్హోమ్ (64) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. కెప్టెన్ కేన్ విలిమ్సన్ 41 పరుగులు చేశారు. కోలిన్ మన్రో 12 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్ దాటలేదు. దీంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేసింది.
తమ గదికి రాలేదని సినిమాల నుంచి తొలగించిన నీచులు… రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు