రెండో టెస్టులో కివీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి చవి చూసింది. కివీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం ఎదుర్కోవడమే కాకుండా టెస్టుల్లో కూడా వైట్వాష్ తప్పలేదు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 242 పరుగులకు ఆలౌట్ ఆయిన ఇండియా.. ఆతిధ్య జట్టును కేవలం 235 పరుగులకే ఔట్ చేసి.. 7 పరుగుల లీడ్ సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచి కివీస్ ముందు 132 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇండియా నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(52), బ్లండెల్(55) రాణించగా.. ఏడు వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది కివీస్ జట్టు. రెండో ఇన్నింగ్స్లో మన స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పృథ్వీ షా (14), మయాంక్ అగర్వాల్ (3), కోహ్లి (14), రహానే (9)లు అంతా కలిసి ఘోరంగా విఫలం అయ్యారు. ఛటేశ్వర్ పుజారా కొట్టిన 24పరుగులే టీమ్ లో హయ్యస్ట్ స్కోర్. టీ20లు మినహాయిస్తే.. వన్డేలు, టెస్టుల్లో కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది. పేలవమైన పెర్ఫార్మన్స్తో చేజేతులా మ్యాచ్ను చేజార్చుకుంది.