తమ దేశంలో పర్యటించేందుకు ఇజ్రాయిల్ పాస్పోర్టులున్న వారిని అనుమతించబోమని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ ప్రకటించారు. కొన్ని పరిస్థితుల్లో ఇజ్రాయిలీ పౌరులు సౌదీలో పర్యటించ వచ్చంటూ ఇజ్రాయిల్ డీక్రీ జారీ చేయటంతో తాము ఇజ్రాయిలీలను అనుమతించబోమని సౌదీ ప్రకటించింది. సౌదీ విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ సోమవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయంలో తమ విధానం ఖచ్చితంగా వుందని, తమకు ఇజ్రాయిల్తో దౌత్య సంబంధాలు లేనందున, ప్రస్తుతం ఇజ్రాయిల్ పాస్పోర్ట్ హోల్డర్లు తమ దేశానికి రావటం కుదరదని స్పష్టం చేశారు.
తమ అధికారులు ఆహ్వానించినా, మతపరమైన కారణాలు, తీర్థయాత్రలకు అనుమతించినా లేక వ్యాపారపరమైన పెట్టుబడుల సమావేశాల వంటి వాటికి హాజరయ్యేందుకు తొమ్మిది రోజుల వరకూ తమ పౌరులు సౌదీలో పర్యటించవచ్చని ఇజ్రాయిల్ హోం మంత్రి డిక్రీ జారీ చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లు ఇజ్రాయిలీలు, అధికశాతం మంది ముస్లింలు మతపరమైన తీర్థయాత్రల కోసం సౌదీని సందర్శిస్తున్నారు. అయితే వీరు ఇందుకు ప్రత్యేక అనుమతులు కానీ, విదేశీ పాస్పోర్టులను కానీ ఉపయోగిస్తున్నారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినపుడే ఈ ప్రాంతంలో ఇజ్రాయిలీ ప్రమేయం మళ్లీ చర్చకు వస్తుందని తాను భావిస్తున్నట్లు ఫైజల్ చెప్పారు.