రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు.దళితులపై ఏపీలో జరుగుతున్న దాడులు, హత్యలు, శిరోముండనాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని విమర్శించారు.
దళితులపై ప్రభుత్వం దారుణంగా వ్యవహరించవద్దని కోరారు. దాడి అనేది ఒకసారి జరిగితే పొరపాటున జరిగిందని అనుకోవచ్చని, కానీ ఈ దారుణాలు ఆగడంలేదన్నారు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండన చేసిన ఘటననను మరువక ముందే విశాఖలో శ్రీకాంత్ అనే మరో దళిత యువకుడిని దారుణంగా కొట్టి, గుండుకొట్టించారని విమర్శించారు. ప్రభుత్వ మద్యం పాలసీని ప్రశ్నించిన ఓంప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని చెప్పారు.