రేవంత్రెడ్డిని కలిసిన పాల్వయి *స్రవంతి,చలమలకృష్ణారెడ్డి
*అసంతృప్తిగా ఉన్న నేతలకు బుజ్జగింపులు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. పాల్వాయి స్రవంతిని మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. టిక్కెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలను బుజ్జగించేందుకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు రంగంలోకి దిగారు
ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణా రెడ్డి ఇద్దరిని కూర్చొబెట్టి పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడారు. పార్టీ కోసం కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి.. ఇరువురు నేతలకు సూచించినట్టుగా తెలుస్తోంది.
అంతర్గత సమస్యలు లేకుండా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. మునుగోడు టికెట్ ఆశించిన పల్లె రవి, కైలాష్ నేతలతో కూడా రేవంత్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు ఇవాళ సాయంత్రం మునుగోడు ఉప ఎన్నికపై చర్చించేందుకు ఈరోజు సాయంత్రం గాంధీభవన్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం సరళి, అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మునుగోడు కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆహ్వానం పంపారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కీ, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరవుతారు.