ఎమ్మార్పీఎస్ ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతితో పాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా కొందరు ఎమ్మార్పీఎస్ నేతలను కొన్ని చోట్ల అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. అసెంబ్లీకి వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. మందడం కూడలి వరకే బస్సులు నడిపిస్తున్నారు. సచివాలయం వైపు వాహనాలు వెళ్లకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. మంగళగిరి, మాచర్ల ప్రాంతాల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.