ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను రావడంలేదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
తన అనుచరులతో కలసి లింగపల్లిలో ట్రైన్ ఎక్కిన రఘురామకృష్ణంరాజు… బేగంపేట రైల్వే స్టేషన్ లో అర్ధాంతరంగా మధ్యలోనే వెనుదిరిగారు. తన నరసాపురం నియోజకవర్గమైన భీమవరంలో అల్లూరి సీతారామరాజు ఆవిష్కరణ సభకు రఘురామకృష్ణరాజు తన అనుచరులతో కలసి రైలులో బయలు దేరారు.
అయితే తమను ఏపీ పోలీసులు పోలీసులు వెంబడిస్తున్నారని అనుమానించి మధ్యలోనే దిగిపోయారు. తన భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నారు
ఇప్పటికే రఘురామకు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేపట్టిన యువకులతో పాటుతన అనుచరులుపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెనుదిరుగుతున్నట్లు రఘరామ చెప్పారు.
కాగా.. ప్రధాని పర్యటన సందర్భంగా.. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో గానీ.. వేదికపై ఉండే వారి జాబితాలో గానీ… హెలిప్యాడ్ దగ్గర ప్రధానిని ఆహ్వానించే వారి జాబితాలో గాని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ రాజు పేరు ఎక్కడా లేదని ఏలూరు రేంజి డిఐజి పాలరాజు తెలిపారు.
ఈ విషయంలో తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ప్రధాని కార్యక్రమానికి రఘురామ ఎలా వస్తున్నారో తమకు తెలియదని వెల్లడించారు. రఘురామ సెల్ఫోన్ నెంబర్ను పోలీస్ శాఖ బ్లాక్లిస్టులో పెట్టలేదని వివరించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఏపీలో ఫ్లయంగ్ జోన్ కు సంబంధించి ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.