ఏపీలో గెలుపు ఎవరిది అనే దానిపై గందరగోళం నిలకొంటుంది. రెండు ప్రధాన పార్టీలు తమదే గెలుపు అని ఇప్పటికే ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. మొదటి నుండి తమ పార్టీ కూడా ప్రధాన భూమిక వహిస్తుంది .. అనుకున్న జనసేన, తన స్థానం ఇప్పటికైనా అర్ధం చేసుకోవడం తో, తదుపరి కార్యాచరణ గురించి ఆలోచనలో పడింది. ప్రాధమికంగా ఎన్ని సీట్లు వచ్చినా, ఏదో ఒక పార్టీకి మద్దతు పలకాలి అని ఆ పార్టీకి అర్ధం అయ్యింది. అయితే, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే టెన్షన్ సామాన్య జనం నుంచి బడా నాయకుల వరకు ఎవరికీ అంతు చిక్కడంలేదు. అసలు ఏపీలో టీడీపీ, వైసీపీ లలో స్పష్టంగా అధికారంలోకి వచ్చే పార్టీ ఏంటో అంతు తేలడంలేదు.
ఈసీ ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం విధించడంతో ఓటరు నాడి ఎలా ఉంది అనే విషయం ఒకటే కన్ఫ్యూజన్ కి గురిచేస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ ఇప్పటికే అనేక సర్వేల ద్వారా తేలినట్టు బయట ప్రచారం జరుగుతుండగానే టీడీపీ అధినేత చంద్రబాబు తామే అధికారంలోకి రాబోతున్నామని, ఇది పక్కా అని చెబుతూ అందరిని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాడు.
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉంది. తమకు అరకొర సీట్లు వచ్చినా ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందేనని అయితే ఆ పార్టీ ఏదో తెలియక జనసేన తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే అంతర్గతంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాడని అపవాదు మూటగట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో చూసుకుని దానిని అనుసరించి ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. గెలించిన జనసేన అభ్యర్థుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆ తరువాత తమ పొలిటికల్ స్టెప్ వేయాలని చూస్తున్నాడట.
ఏపీలో నిజంగా పవన్ ముందు నుంచి అంచనా వేస్తున్నట్టు హంగ్ ఏర్పడితే జనసేన పార్టీకి కి పదుల సంఖ్యలో సీట్లు వస్తే అప్పుడు తమ డిమాండ్ల చిట్టా విప్పి, తమ కండిషన్స్, ఆబ్లిగేషన్స్ చెప్పాలని పవన్ ఆలోచనగా ఉందట. ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చినా వైసీపీ వచ్చినా తమ కోర్కెల చిట్టాలో మార్పేమీ లేదన్నట్టుగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాస్త ముందుగా తెలిస్తే ఆ పార్టీతో సఖ్యతగా ఉండవచ్చని జనసేన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ, అలాంటి అవకాశాలు కనిపించకుండా, తీవ్ర గందరగోళం ఏర్పడటం విశేషం. అంటే మే 23 రాత్రి ఈ రచనలు అన్ని కార్యరూపం దాలుస్తాయి.