అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టికల్ 370 రద్దు విషయంలో భాజపాపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర, హరిమాణా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఆర్టికల్ 370 ప్రస్తావన తీసుకొచ్చి ప్రజలను పక్కదారి పట్టిస్తోందని పవార్ విమర్శించారు. మహారాష్ట్రలోని అకోలాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ పవార్ వ్యాఖ్యలను ఖండించారు.
ఆర్టికల్ 370, మహారాష్ట్రకు ఏం సంబంధం ఉందని ఓ బాధ్యత లేని ప్రతిపక్షం అంటోంది. జమ్ముకశ్మీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహారాష్ట్ర పిల్లలను చూసి దేశమంతా గర్విస్తోంది. కానీ కొంత మంది స్వార్థ రాజకీయ నాయకులు వారి స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మహనీయుడు ఛత్రపతి శివాజీ పుట్టిన ఈ పవిత్ర గడ్డపై స్వార్థరాజకీయ నేతల మాటలు వినిపిస్తున్నాయి. జమ్ము కశ్మీర్తో మహారాష్ట్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ.. ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ చూడాలని ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర, హరియాణాలో అక్టోబరు 21న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అనంతరం అక్టోబరు 24న ఫలితాలు వెల్లడవుతాయి.