ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్స్ ఎమ్మేల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం విదితమే. రెండు మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో తాను అసలు పార్టీ ఎందుకు మారాలనుకున్నాడో చిరుమర్తి లింగయ్య వివరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విధానాలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు తేల్చిచెప్పారు. ఎవరీ ప్రోద్భలంతోనూ తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ తనకు రాజకీయంగా ఎంతో సహకరించారని చెప్పుకొచ్చారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ లోకి వస్తారో రారో తనకు తెలియదన్నారు. చిరుమర్తి పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. చిరుమర్తి లింగయ్య పార్టీ మారడం తనకు చాలా బాధకలిగిందని ఆయన అన్నారు. లింగయ్య ఇంత నమ్మకద్రోహం చేస్తారని అనుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. లింగయ్య పార్టీ మారుతున్నాడన్న విషయం టీవీలో చూసేంతరకు తనకు తెలీదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.