ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలేమీ లేవని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రసంగంపై తాము న్యాయ నిపుణుల సలహా తీసుకున్నామని, విద్వేషపూరిత వ్యాఖ్యలేమీ లేవని తేలిందని సీపీ తెలిపారు. దీంతో అక్బరుద్దీన్కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఒక్క 15 నిమిషాలు వదిలిపెడితే, హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తానంటూ 2013లో తాను అన్న మాటలను అక్బరుద్దీన్ ఈ నెల 23న కరీంనగర్ సభలో గుర్తు చేశారు.
ఆ రోజు అలా అనబట్టే ఆర్ఎస్ఎస్ తమ జోలికి రాలేదని, ఇప్పటికీ భయపడుతోందని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. అక్బరుద్దీన్ ప్రసంగంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ అక్బరుద్దీన్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. చట్టానికి లోబడే తాను ప్రసంగించానని స్పష్టం చేశారు.