telugu navyamedia
సినిమా వార్తలు

మంచు విష్ణుకు బాలకృష్ణ మద్దతు

‘మా’ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో టాలీవుడ్‌లో వేడి పెరిగింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎ‍న్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బరిలోకి దిగిన రెండు ప్యానల్స్ సభ్యులు రాజకీయ ఎన్నికలను తలపించేలా పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ ఆదివారం పలువురితో కలిసి మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే హీరో బాలకృష్ణను కలిసి ప్రసన్నం చేసుకున్నారు మంచు విష్ణు. అఖండ షూటింగ్ జరుగుతుండగా వెళ్లి బాలకృష్ణ మద్దతు కోరారు. ఆయన ఓకే చెప్పడంతో నన్ను ఆశీర్వదించి, మా ప్రెసిడెంట్‌గా నాకు మద్ధతు ఇచ్చినందుకు ధన్యవాదాలు ‘బాల అన్న మద్దతు లభించడం నాకు గౌరవం’ అంటూ ట్వీట్ చేశారు.

టాలీవుడ్‌లో కొన్ని కుటుంబాలు కీలకంగా మారాయి. మంచు విష్ణు ఇంటింటికీ వెళ్లి ఓటును అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే తన తండ్రితో కలిసి సీనియర్ నటుడు కృష్ణని కలిసి మద్దతు కోరిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు కూడా తన తనయుడికి ఓటు వేయాలంటూ ఫోన్‌లో పలువురిని కోరుతున్నారు. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ మంచు విష్ణుకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఆదివారం హైదరాబాద్‌ ఎఫ్‌.ఎన్‌.సి.సిలో కొంతమంది ‘మా’ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ‘మా’ అధ్యక్షులుగా పోటీచేస్తున్న ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు తమ మేనిఫెస్టోను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఇద్దరి మేనిఫెస్టోల్లోనూ ‘మా’ భవన నిర్మాణమే ప్రధాన హామీగా తెలుస్తోంది. ‘మా’ లో మొత్తం 914 మంది సభ్యులు ఉండగా గత ఎన్నికల్లో 400కి పైగా సభ్యులు ఓటింగ్‌కు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Related posts