ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు మైలురాయి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం వద్ద ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు శంకుస్థాపన చేసారు .
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్లో బ్లూ జెట్ హెల్త్కేర్ గ్రీన్ఫీల్డ్ ఔషధ తయారీ యూనిట్కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ ఆధునిక ఫార్మాస్యూటికల్ తయారీలో ఆంధ్రప్రదేశ్ను కీలక గమ్యస్థానంగా మరింత బలపరుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో మూడు బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
ఒక్కసారి మాతో ఒప్పందం చేసుకున్న తర్వాత అది మీ ప్రాజెక్ట్ కాదు మా సొంత ప్రాజెక్ట్ గా భావిస్తాం. పెట్టుబడిదారులను బయటి వ్యక్తులుగా కాదు, అభివృద్ధి భాగస్వాములుగా చూస్తాం.
రెండో కారణం విశ్వసనీయత, ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకం. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత ఉంది.
ఆంధ్రప్రదేశ్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది అని పెట్టుబడిదారులు నమ్ముతున్నారు.
అదే మా అతి పెద్ద బలం. మూడోది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. రాష్ట్రంలో, కేంద్రంలో బలమైన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ వేగంగా, స్థిరత్వంతో, వ్యూహాత్మక స్పష్టతతో ముందుకు సాగుతోంది.
గతేడాది నా సొంత నియోజకవర్గమైన మంగళగిరికి చెందిన వేణుబాబు నన్ను కలుసుకున్నారు. అది కేవలం అధికారిక సమావేశం కాదు ఆశతో నిండిన సంభాషణ. ఆయన బ్లూ జెట్ హెల్త్కేర్ సంస్థ సీనియర్ అధికారిగా మాత్రమే కాకుండా, ఏపీకి చెందిన వ్యక్తిలా మాట్లాడారు.
దేశవ్యాప్తంగా విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని చెప్పి.. ఎందుకు మన రాష్ట్రం కాదు? మన ప్రజలకు అవకాశాలు ఎందుకు సృష్టించకూడదు అని ప్రశ్నించారు.
ఆ భావనే ఈ ప్రాజెక్టుకు ప్రేరణ అయింది. ఆయన ఆసక్తి వ్యక్తం చేసిన వెంటనే, దాన్ని సాధారణ ప్రతిపాదనగా కాకుండా, పెట్టుబడిని స్వదేశానికి తీసుకురావడానికి ఒక అవకాశంగా చూశాం.
ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వెంటనే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి ఆలస్యం లేకుండా జాగ్రత్తపడ్డాం.
అతి తక్కువ కాలంలోనే రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్-IIలో 102 ఎకరాలకు పైగా భూమి కేటాయించడం జరిగింది.
అవసరమైన అనుమతులు, ఒప్పందాలు వేగంగా పూర్తయ్యాయి. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాం.
ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక సంభాషణ నుంచి భూమిపూజ వరకు వచ్చిన ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ప్రతి పెట్టుబడి వెనుక కష్టం ఉంటుంది. ప్రతి పరిశ్రమకు ఒక కథ ఉంటుంది.
ప్రతి ఉద్యోగం ఒక కలగా మొదలై.. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి నడిచినప్పుడు నిజమవుతుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం మౌలిక వసతులు లేదా పెట్టుబడి గురించి కాదు.. ఇది నమ్మకం గురించి.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి తన రాష్ట్రంపై నమ్మకం ఉంచిన కథ. ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరుకు నిదర్శనం.
వేలాది కుటుంబాల జీవితాలను మార్చే అవకాశాలను సృష్టించడం. ఇదే ఆంధ్రప్రదేశ్ మోడల్. ప్రకటనలకే పరిమితం కాకుండా అమలుకు ప్రాధాన్యత ఇస్తాం.
బ్లూ జెట్ హెల్త్ కేర్ సంస్థ రూ.2,300 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 1,750 మందికి ప్రత్యక్ష, 250 మందికి పరోక్ష ఉద్యోగాలను కల్పించనుంది. 2,000 కిలోలీటర్ల సామర్థ్యంతో భారీ API, ఇంటర్మీడియేట్స్ తయారీ యూనిట్ అభివృద్ధి చేస్తుంది.
ఉత్తరాంధ్రను ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దుతాం. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం.
గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఐటీ పెట్టుబడులు వంటి ప్రధాన ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా మారుతోంది.
క్లస్టర్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఈవీలు, టెక్స్ టైల్స్, ఐటీ అండ్ డిజిటల్ సర్వీసెస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక శక్తి, ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్ వంటి రంగాల్లో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం.
2024 ఎన్నికల్లో 94శాతం సీట్లు సాధించాం. ఇదో చరిత్ర. 50శాతం ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికయ్యారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు.
రాష్ట్రాభివృద్ధికి కసితో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఏకైక అజెండా. బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ తమ విస్తరణ కోసం ఏపీని ఎంచుకున్నందుకు సంస్థ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
బ్లూ జెట్ కు వాట్సాప్ మెసేజ్ దూరంలోనే ఉన్నాను. అన్ని విధాల అండగా నిలుస్తాం. ఈ పెట్టుబడి మా పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, ఔషధ తయారీ సామర్థ్యాన్ని పెంచుతూ, పెట్టుబడిదారుల నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది.
ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని, సమయానికి పూర్తికావాలని, బ్లూ జెట్ హెల్త్కేర్తో దీర్ఘకాల భాగస్వామ్యం కొనసాగాలని ఆశిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ యువ రాష్ట్రంగా ఉంది. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక వృద్ధి జరుగుతోంది. పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
బ్లూ జెట్ హెల్త్కేర్ మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ వాతావరణంలో స్పీడ్ అనేది చాలా ముఖ్యం. ఏపీలో యూనిట్ స్థాపనకు అన్ని ప్రభుత్వ వ్యవస్థలు మాకు ఎంతగానో సహకరించాయి. బ్లూ జెట్ సంస్థ రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు,
ఏపీఆర్డీసీ ఛైర్మన్ పి.నాగేశ్వరరావు, బ్లూ జెట్ హెల్త్కేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అక్షయ్ అరోరా, మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేణుబాబు, సహ వ్యవస్థాపకులు & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేష్ షా, కలెక్టర్ విజయ కృష్ణన్ తో పాటు బ్లూ జెట్ హెల్త్కేర్ బృంద సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఏపీఐఐసీ, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

