telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం అమరావతిలో ఏర్పాటుకు శాసనమండలి ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

దీనితో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపనను సులభతరం చేసే సవరణ బిల్లులకు, మరికొన్ని మార్పులకు శాసనమండలి ఆమోదం తెలిపింది.

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ మూడు కీలక బిల్లులను మండలిలో ప్రవేశపెట్టగా, సభ వాటికి ఆమోద ముద్ర వేసింది.

రాష్ట్రంలో న్యాయ విద్య, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్’ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును మంత్రి లోకేశ్ సభ ముందుంచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గవర్నర్ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను రాష్ట్రానికి సాధించుకోగలిగాం” అని తెలిపారు.

అమరావతిలో ఈ విశ్వవిద్యాలయం కోసం కూటమి ప్రభుత్వం 55 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, ఇందులో ఏపీ విద్యార్థులకు 25 శాతం సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు ప్రకటించారు.

వర్సిటీతో పాటు ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఇదే సమయంలో, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు హామీని నిలబెట్టుకుంటామని, ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని లోకేశ్ స్పష్టం చేశారు.

Related posts