తమిళనాడులోని కూనూర్లో ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిన ఘటనలో 13 మంది మృతి చెందిన వారిలో లాన్స్ నాయక్ బి సాయి తేజ ఒకరు. హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్తో పాటు లాన్స్ నాయక్గా విధులు నిర్వహిస్తున్న సాయితేజ కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిత్తూరు జిల్లా వాసి జవాన్ లాన్స్నాయక్ సాయితేజ మృతి చెందాడు.
అయితే నిన్న బెంగళూరుకు చేరుకున్న సాయితేజ పార్థీవదేహం ఈ రోజు ఎగువరేగడుకు చేరుకోనుంది. లాన్స్ నాయక్ సాయితేజకు కన్నీటి వీడ్కోలు తెలిపేందుకు వేలాది మంది యువత మదనపల్లికి చేరుకుంది. జాతీయ జెండాలతో జై జవాన్.. అమర్ రహే సాయితేజ అంటూ నినాదాలతో మదనపల్లి మార్మోగింది. తుదిశ్వాస వరకూ దేశ సేవలో గడిపిన సాయితేజ ఎందరో యువతకు మార్గం అంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. సాయితేజ భౌతికకాయంతో ఎగువరేగడకు బైక్ ర్యాలీగా భారీ సంఖ్యలో వెళ్ళారు.
సాయితేజ ఫొటోలతో ఉన్న టీషర్ట్, జాతీయ జెండాలతో యువకులు రోడ్లపైకి వచ్చి బైక్ ర్యాలీ చేపట్టారు. అమర్ రహే సాయితేజ నినాదాలతో అంతిమయాత్ర సాగుతోంది. సంఘీభావ యాత్రలో పాల్గొనడానికి చిత్తూరు జిల్లా ప్రజలు తరలిరావడంతో పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మదనపల్లి నుంచి అంగళ్లు మీదుగా ఎగువరేగడికి అంతిమయాత్ర ర్యాలీ చేరుకోనుంది.
ఈ నేపథ్యంలో ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం సాయితేజ మృతదేహం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం సాయితేజ అంత్యక్రియలు జరుగనున్నాయి.
మరోవైపు రేగడిపల్లిలో సాయితేజ భౌతికకాయం ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయితేజ తాత సమాధి పక్కనే ఆయన్ను ఉంచనున్నారు. ఆర్మీ అధికారులతో పాటు లోకల్ పోలీసులు.. జిల్లా యంత్రాంగం మొత్తం రేగడిపల్లిలోనే సాయితేజ అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు.