తెలంగాణ ఇంటి పార్టీ తెరాస మాత్రమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేది తెరాస మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం రాజీలేకుండా పోరాడేది తెరాస మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హెచ్ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేటీఆర్ పోలీసు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, నగర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 27వ తేదీన హెచ్ఐసీసీలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతినిథులందరూ 10 లోపు ప్లీనరీ ప్రాంతానికి చేరుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఉదయం 11 గంటలకుకు పార్టీ జెండాను తెరాస అధినేత కేసీఆర్ ఆవిష్కరిస్తారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. సాయంత్రం 5 వరకు వివిధ అంశాలపై తీర్మానాలు, చర్చలు జరుగుతాయన్నారు. ప్రతినిధుల సభకు దయచేసి ఆహ్వానితులు మాత్రమే రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.