ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన ఇక లేరు అనే వార్తను తట్టుకోలేక గుంటూరు నగరంలోని డొంకరోడ్డు ప్రాంతానికి మద్దినేని వెంకటేశ్వర్లు అనే ఓ అభిమాని గుండెపోటుకు గురై మరణించారు. నిన్న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
మరోవైపు నరసరావుపేటలోని రాజాగారితోటలో ఉన్న కోడెల నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. శివప్రసాదరావు పార్థివదేహం వెంట టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్నారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో పేటలోని ప్రధాన వీధులన్నీ జనసంద్రమయ్యాయి. మరికొద్దిసేపట్లో నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు జరుగనున్నాయి.