నిన్న కర్ణాటక అసెంబ్లీ లో జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్షలో సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయని ఎమ్మెల్యే మహేశ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. మహేశ్ వైఖరిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలనే బీఎస్పీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహేశ్ ప్రవర్తించారు. ఆయన మంగళవారం రోజున సభకు హాజరుకాలేదు. హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.
తక్షణమే మహేశ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నా అని మాయావతి పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి, మాయావతి కోరిక మేరకు తన మంత్రివర్గంలో మహేశ్ కు స్థానం కల్పించారు. అయితే, 2018 అక్టోబర్ లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. కానీ ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో ఎమ్మెల్యే మహేశ్ పై బీఎస్పీ వేటువేసింది.