నేడు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 97వ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తారక్, కల్యాణ్ రామ్లు ఆయనకు నివాళులు అర్పించారు. ఉదయం 5.30 గంటలకే తారక్, కల్యాణ్ రామ్ ఘాట్ను సందర్శించారు. ఎన్టీఆర్ సమాధిపై పువ్వలు చల్లి నివాళులు అర్పించారు. తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్టీయార్ ఘాట్ వెలవెలబోయింది. పూలతో కలకలలాడాల్సిన సమాధి కల తప్పడంతో జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ అసహనం వ్యక్తం చేశారు. తాత జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు తెల్లవారుజామునే తారక్, కల్యాణ్రామ్ ఎన్టీయార్ ఘాట్కు వచ్చారు. కారు దిగి సమాధి వద్దకు రాగానే అక్కడి పరిస్థితిని చూసి షాక్ అయ్యారు.
ఎన్టీయార్ జయంతి, వర్ధంతి రోజుల్లో ఎప్పుడూ పుష్పాలతో కలకలలాడే ఘాట్.. ఈసారి ఒక్క పువ్వు కూడా లేకుండా వెలవెలబోయింది. దీంతో జూనియర్ ఎన్టీయార్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే భారీగా పుష్పాలను తెప్పించి తానే స్వయంగా తాత సమాధిని అలంకరించారు. అక్కడే ఉన్న అభిమానుల సాయంతో సమాధి మొత్తం పూలతో కలకలలాడేలా చేశారు. తర్వాత పుష్పగుచ్చాలతో తారక్, కల్యాణ్రామ్ నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి జూనియర్ ఎన్టీయార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలుగు సినిమా చరిత్రలో సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా నందమూరి తారకరామారావు చెరగని ముద్రవేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి 8 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి సుపరిపాలన అందించారు తారక రామారావు.