ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపిన వైసిపి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
జనసేన కార్యకర్తలు ఏపీలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది.
లాంతర్లు, విసనకర్రలు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్న జనసేన శ్రేణులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాయి.
అయితే కలెక్టరేట్ గేట్ వద్దే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మరోవైపు విద్యుత్ చార్జీల పెంపుపై విశాఖ లో టిడిపి కూడా ఆందోళన చేపట్టింది. విశాఖ టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా మహిళలు, టిడిపి కార్యకర్తలు జీవిఎంసి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. విద్యుత్ చార్జీలను బేషరతుగా తగ్గించాలని, పేదలపై అన్ని విధాలుగా భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం జగన్ పదవి నుంచి దిగిపోవాలని నేతలు డిమాండ్ చేశారు.
అలాగే తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని సీపీఐ, సీపీఎం ఆధ్వర్యం లో ముట్టడించారు. సీఎండీని కలిసేందుకు కార్యకర్తలు గేట్లు తోసుకుంటూ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు.
తనను ఓడించేందుకు వంద కోట్లు: పవన్