గత ఏడాదిలో ప్రారంభమై, రేపటితో వైసీపీ అధినేత సంకల్పించిన ప్రజాసంకల్ప యాత్ర ముగుస్తుంది. అనంతరం కార్యాచరణ కూడా గతంలోనే ప్రకటించినప్పటికీ, మరోసారి పాదయాత్ర ముగింపు సభలో దానిపై స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 340 రోజులుగా సాగుతున్న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర బుధవారంతో ముగియనుండగా, ఈ అరుదైన క్షణాలను మరపురాని అనుభూతిగా మార్చుకునేందుకు వైకాపా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సుందరమైన పైలాన్ నిర్మాణం పూర్తయింది. పైలాన్ పనులను వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు.
పాదయాత్ర రేపు సాయంత్రంతో ముగియనుండగా, ఆపై జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున జనసమీకరణ పనులలో శ్రీకాకుళం జిల్లా నేతలు నిమగ్నమై ఉన్నారు. ఇక బహిరంగ సభ ముగిసిన అనంతరం విశాఖపట్నం చేరుకునే జగన్, అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. 10వ తేదీన ఆయన కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. తిరుమల పర్యటన అనంతరం ఇడుపులపాయకు వెళ్లి, తన తండ్రి స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు.