ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బుధవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని,
నిపుణుల సూచనలు గాలికి వదిలేసి వ్యవస్థను భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లను మార్చి, పనులు ఆపేసి ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికీ వైసీపీ అనాలోచిత నిర్ణయాలే కారణమని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల పట్ల చేసిన చారిత్రక తప్పిదమని విమర్శించారు.
గత పాలకులు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఇప్పుడు తాము శ్రమించాల్సి వస్తోందని, ప్రాజెక్టును అటకెక్కించి ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పడం సిగ్గుచేటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

