ఢిల్లీలో ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన స్టార్టప్ మహా కుంభ్ ఈవెంట్ లో మహిళల ఆరోగ్యం కోసం మాగ్నా ప్యాడ్స్ పేరుతో స్మార్ట్ శానిటర్ ప్యాడ్ ను రూపొందించి విశేష ప్రతిభ కనబరిచిన మంగళగిరి విద్యార్థి వనమా వంశీని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు.
ఈ మేరకు ఉండవల్లి నివాసంలో వంశీని కలిశారు. జాతీయస్థాయిలో జరిగే స్టార్టప్ మహా కుంభ్ ఈవెంట్ లో దాదాపు వెయ్యి కాలేజీలకు చెందిన నుంచి విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు.
వడ్లమూడి విజ్ఞాన్ కాలేజీలో బీ-ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంశీ తన గైడ్ డాక్టర్ పి.శ్రీనివాస్ బాబు సాయంతో స్టార్టప్ మహా కుంభ్ ఈవెంట్ కు హాజరై మహిళల ఆరోగ్యం కోసం తాను రూపొందించిన స్మార్ట్ శానిటరీ ప్యాడ్ ను ఆవిష్కరించారు.
తన వినూత్న ఆవిష్కరణతో రూ.8లక్షల నగదు బహుమతిని గెలుచుకుని సౌత్ ఇండియాలోనే ప్రథమంగా నిలిచాడు. వంశీ ఆవిష్కరణను ఇండియన్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది.
స్టార్టప్ మహాకుంభ్ లో ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా విద్యార్థి వంశీని మంత్రి లోకేష్ ప్రశంసించారు. భవిష్యత్ లో అండగా ఉంటామని, అమరావతిలో ఏర్పాటుచేయబోయే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.