చైనా సహకారంతో వెనిజులా రాజధాని కారకాస్లో నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారాన్ని అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రారంభించారు. దేశంలో చమురు ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ సహకారంతో నిర్మించిన ఈ కొత్త రిఫైనరీని సైనో వెన్సా సంస్థ నిర్వహిస్తుంది. ఈ కొత్త రిఫైనరీ ద్వారా చమురు ఉత్పత్తిని రోజుకు ప్రస్తుతం వున్న 1.1 లక్షల బ్యారెళ్ల స్థాయి నుండి 1.65 లక్షల బ్యారెళ్ల స్థాయికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. చమురు ఉత్పత్తిని పెంచటం ద్వారా అమెరికా తమపై అమలు చేస్తున్న దిగ్బంధాన్ని తాము అధిగమిస్తామని, వెనిజులా చమురుశాఖ మంత్రి పిడివిఎస్ఎ అధ్యక్షుడు మాన్యుయెల్ క్వెవెడో చెప్పారు.
చైనా-వెనిజులా సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు, పరస్పర గౌరవం, నిరంతర చర్చల ప్రాతిపదికన తాము ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మదురో చెప్పారు. వెనిజులాకు చెందిన చమురు రిఫైనరీల రిపేర్లను చేపట్టేందుకు షాంఘయికి చెందిన విజన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ వెనిజులాతో గత నెలలో ఒక అవగాహనకు వచ్చినట్లు బ్లూంబెర్గ్ వెబ్సైట్ గురువారం ఒక వార్తా కథనంలో వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఏడాదిలో ఆర్నెల్లపాటు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.