telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయాలలో వ్యక్తిగత దూషణలతో పాటు భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై విజయవాడ (పశ్చిమ) బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు.

రాష్ట్రంలో కక్ష రాజకీయాలు శ్రేయస్కరం కాదని, వ్యక్తిగత దూషణలతో పాటు భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన హితవు పలికారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి ఘటనలను ఎట్టిపరిస్థితుల్లో సహించరని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయని తెలిపారు.

వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించాలని, అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అయితే, దీనికి ప్రతిగా భౌతిక దాడులకు దిగడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

కక్ష సాధింపు రాజకీయాలు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమని సుజనా చౌదరి హెచ్చరించారు.

చట్టబద్ధంగానే పరిస్థితిని అదుపులోకి తెస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల అవగాహనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.

Related posts