టోక్యో ఒలింపిక్స్ లో ఇవాళ అద్భుత అవకాశాన్ని టీమిండియా మహిళల హాకీ జట్టు చేజార్చుకుంది. బ్రిటన్ మరియు భారత మహిళల హాకీ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్పై ఓటమి పాలైంది. చేతులారా కాంస్య పతకాన్ని భారత మహిళల హాకీ జట్టు మిస్ చేసుకుంది. బ్రిటన్తో జరిగిన పోరులో 3-4 తేడాతో పరాజయం చవి చూసింది భారత మహిళల హాకీ జట్టు. గెలుపు కోసం రాణి రాంపాల్ సేన ఆఖరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. చివరకు విజయం బ్రిటన్ నే వరించింది.
మ్యాచ్లో తొలి క్వార్టర్లో గోల్ చేసి బ్రిటన్ 1-0 ఆధిక్యం సంపాదించింది. ఆ గోల్ను అడ్డుకోబోయిన భారత్ స్వయంగా బంతిని గోల్లోకి పంపింది. తర్వాత బ్రిటన్ అదే క్వార్టర్లో రెండో గోల్ వేసింది. కాసేపటికే భారత్ కూడా గోల్ వేసింది. పెనాల్టీ కార్నర్ను భారత్ గోల్గా మలచగలిగింది. తర్వాత కాసేపటికే భారత్కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. దానిని కూడా గోల్ పోస్టులోకి పంపగలిగారు. సెకండ్ క్వార్టర్ చివర్లో మరో గోల్ వేసిన భారత్ బ్రిటన్పై 3-2 ఆధిక్యం సాధించింది. మూడో క్వార్టర్ మొదలవుతూనే బ్రిటన్ మరో గోల్ కొట్టింది. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయ్యింది. అయితే, నాలుగో క్వార్టర్ చివర్లో బ్రిటన్ కీలకమైన నాలుగో గోల్ కొట్టింది. దీంతో భారత్పై 4-3 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఫలితంగా భారత జట్టు ఓటమిని చవిచూసింది.
విశ్వ క్రీడల్లో భారత హాకీ జట్లు తమ అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాయి. బంగారు పతకం కోల్పోయినా ఆట మాత్రం బంగారమే అనిపించాయి. చివరి వరకు పోరాట పటిమతో లీగ్లో 3 మ్యాచ్లు ఓడిపోయినా అనూహ్యంగా పుంజుకుని సెమీస్కు వెళ్లింది. సెమీస్లో అర్జెంటీనాకు గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాణి రాంపాల్ సేన పోరాటానికి దేశం మొత్తం అండగా నిలిచింది. మహిళల టీమ్ అద్భుత ప్రదర్శనకు యావత్ దేశం జైకొట్టింది. గుజరాత్లోని వజ్రాల వ్యాపారి భారత మహిళా హాకీ టీమ్కు ఇల్లు, కారు అందిస్తానని హామీ ఇచ్చారు.