కేరళకు చెందిన విజయన్ మథన్ గోపాల్ (39) అనే వ్యక్తి 2017లో నవంబరు 2న కొచిన్ నుంచి సింగపూర్ వెళ్లిన విమానంలో విజయన్ మద్యం సేవించి ప్రయాణించాడు. విజయన్ మద్యం సేవించి నడవలేని స్థితిలో విమానం ఎక్కాడు. అనంతరం మరో ఫ్లైట్ అటెండెంట్తో ఫుడ్ విషయంలో విజయన్ గొడవ పెట్టుకున్నాడు. బాధితురాలు అదే ఫ్లైట్కు ఇన్చార్జ్గా వ్యవహరిస్తోంది. విజయన్, ఫ్లైట్ అటెండెంట్ మధ్య ఘర్షణను ఆపడానికి ప్రయత్నించింది. ఘర్షణ ఆగినప్పటికీ విజయన్ మాత్రం అస్తమానం కాల్ లైట్ నొక్కుతుండటంతో బాధితురాలు ఇలా చేయద్దని నచ్చచెప్పింది. అదే సమయంలో విజయన్ బాధితురాలి ముఖంపై చేయి వేసి.. బుగ్గలను నిమిరి, అంతటితో ఆగకుండా బాధితురాలి తొడపై చేయి వేశాడు. అనంతరం ఆమె పిరుదులపై కూడా చేయి వేయడంతో బాధితురాలు వెంటనే ఫ్లైట్ కెప్టెన్కు సమాచారమిచ్చింది. విమానం సింగపూర్లో ల్యాండ్ అయిన వెంటనే విజయన్ను ఎయిర్పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు వివిధ కేసులు విజయన్పై నమోదు చేశారు. కోర్టులో మాత్రం తనదేం తప్పు లేదంటూ విజయన్ వాదించాడు. మరో ఫ్లైట్ అటెండెంట్తో తనకు ఘర్షణ జరిగిందని.. ఆమెను కాపాడటానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు. అప్పటి నుంచి కేసుకు సంబంధించి విచారణ జరుగుతూ వస్తుండగా.. సోమవారం ఈ కేసులో కోర్టు విజయన్ను దోషిగా తేల్చింది. సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఈ ఘటన జరగడంతో సింగపూర్ చట్టం కింద అతనికి రెండేళ్ల జైలు శిక్ష, ఫైన్తో పాటు మూడు కేసులకు సంబంధించి ఇతర శిక్షలు విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. విజయన్ ఇదే కేసుపై తిరిగి కోర్టులో హాజరుకానున్నాడు. ఆగస్టు 28న ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు రానుంది.
previous post