telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ పేరిట అనంతపురంలో బహిరంగ సభకు జనం భారీగా హాజరు

ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ పేరిట అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.

ఈ సభకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది.

కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన సందర్భంగా పాలన విజయాలను, సూపర్ సిక్స్ పథకాల అమలును ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానుండగా, ఉదయం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు వాహనాల్లో తరలివస్తున్నారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యాహ్నం 1:30 గంటలకు సభా వేదికకు చేరుకుంటారు.

ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అనంతపురం చేరుకుని సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సభకు జనం భారీగా హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ఠమైన చర్యలు చేపట్టారు.

పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించి, వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు, ప్రజల కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేశాయి.

సభా ప్రాంగణానికి సమీపంలోనే వంటశాలలు ఏర్పాటు చేసి, అందరికీ భోజనం అందిస్తున్నారు. ఈ సభ ద్వారా తమ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మరింత విశ్వాసం కల్పించాలని కూటమి నేతలు భావిస్తున్నారు.

Related posts