కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద లింగంపల్లి-ఫలక్నుమా ఎంఎంటీఎస్, కర్నూల్ – సికింద్రాబాద్ ఇంటర్సిటీ(హంద్రీ) ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన ఘటనలో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 27 గంటల పాటు సివిల్, సిగ్నలింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు ప్రమాద అనంతర పనుల్లో నిమగ్నమయ్యారు. రైళ్ల మళ్లింపు, రైల్వే ట్రాక్ పునరుద్ధరణ, విద్యుదీకరణ, సిగ్నల్ వ్యవస్థ తీర్చిదిద్దడం ఇలా అనేక పనులు ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఎంతవరకు నష్టం వాటిల్లి ఉంటుందో ఎప్పుడే అంచనా వేయడం కష్టం. దెబ్బతిన్న రైళ్ల బోగీలకు మాత్రం రూ.12 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కంటే ఎంఎంటీఎస్ రైలు బోగీలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలులోని డ్రైవర్ క్యాబిన్, రైలును ముందుకు నడిపే వ్యవస్థ(ఇంజిన్)తో పాటు.. మొత్తం 7 బోగీలు దెబ్బతిన్నాయి. కొన్ని బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్వి పాత బోగీలు కావడంతో నష్టం ఆ మేర ఉండదంటున్నారు. రైలు ప్రమాదం తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సాధారణ స్థితికి వచ్చినా.. ఆ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరించలేదు. నేటి నుంచి ఎంఎంటీఎస్లు నడుస్తాయని రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.