ఓ ఇంటి యజమానికి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 20 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ ఇళ్ళంటే యజమానికి ప్రాణం. అందుకే ఒక్క ఇటుక కూడా కూలకుండా, ఇంటికి ఎలాంటి ప్రమాదం జరగనీయకుండా జాగ్రత్తగా తన ఇంటిని మరో చోటుకి తరలించే వినూత్న ప్రయత్నం మొదలెట్టాడు ఇంటి యజమాని. వివరాల్లోకి వెళ్తే… చిత్తూరు నగర శివారులోని తిరుపతి – చిత్తూరు జాతీయ రహదారికి ఆనుకొని ఈ భవనం ఉంది. ఈ ఇంటి యజమాని రామ్మూర్తి రెడ్డి. ఇరవై ఏళ్ల క్రితం ఆయన ఈ ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇల్లు నిర్మించాక వ్యాపార పరంగా తనకు అన్నీ కలిసి వచ్చాయనేది ఆయన సెంటిమెంటు. అయితే అనుకోకుండా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆయన ఇంటి ముందు నుంచి ఓ కొత్త రోడ్డు మంజూరైంది. దీంతో రోడ్డు విస్తరణలో భాగంగా తప్పనిసరిగా ఇల్లు కూల్చివేయాలి. ఈ పరిస్థితిలో ఎంతో ఆవేదనకు గురైన రామ్మూర్తి ఇంటిని కూల్చివేసి వేరొక చోట నిర్మించుకోకుండా మొత్తం బిల్డింగ్ను యధాతథంగా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలనుకున్నాడు. ఇంకేముందు అనుకున్నదే తడవుగా అన్వేషణ ప్రారంభించాడు.
చెన్నైలోని కొన్ని కంపెనీలు బిల్డింగ్ను ఉన్నది ఉన్నట్లుగా తరలించే పనులు చేపడుతున్నాయని తెలుసుకుని వారిని ఆశ్రయించాడు. బాబు హౌస్ లిఫ్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కంపెనీ ప్రతినిధులు రంగంలో దిగారు. మొదట ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పిల్లర్లు వేసి బేస్మెంట్తో సిద్ధం చేశారు. ఆ తర్వాత ఇంటిని జర్మన్ టెక్నాలజీతో ఇదిగో ఇలా యధాతథంగా పైకి లేపారు. 80 టన్నుల బరువున్న ఇంటిని పైకి లేపేందుకు రెండు వందలకు పైగా జాకీలను ఉపయోగించారు. ఎక్కడ ఎలాంటి పగుళ్లు రాకుండా అత్యంత జాగ్రత్తగా మూడు అడుగుల మేర ఇంటిని పైకి లేపారు. ఇక ఇప్పుడు ఆ భవనాన్ని బేస్మెంట్తో సిద్ధంగా ఉన్న ఖాళీ స్థలం పైకి తరలించాలి. ఇందుకోసం ఇంటి నుంచి ఖాళీ స్థలం వరకు రైల్వే ట్రాక్ తరహాలో సిమెంట్ ఇటుకలతో ఓ రహదారి నిర్మించి అత్యంత చాకచక్యంగా భవనాన్ని జరుపుతున్నారు. రోజుకు ఆరు అడుగుల చొప్పున నెమ్మదిగా భవనాన్ని తరలిస్తున్నారు. ఈ మొత్తం కాంట్రాక్ట్ ఖరీదు 15 లక్షలు కాగా 90 రోజుల్లో పూర్తి చేసే విధంగా ఆ ఇంటి యజమాని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ప్రయాణంలో ఆ ఇంటికి ఎలాంటి ప్రమాదం జరిగినా కంపెనీనే బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం ఈ సరికొత్త టెక్నాలజీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.