ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాధ్యాయులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (X) వేదికగా పోస్టు పెట్టారు సీఎం చంద్రబాబు.
‘భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, ఉపాధ్యాయుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ జరుపుకునే పండుగ రోజు ఇది.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమవుతున్నారు.
పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ అభినందనలు తెలుపుతున్నా. అదే అంకితభావంతో పని చేస్తూ ముందుతరాలకు మీరంతా మార్గదర్శులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

