భారత సారథి విరాట్ కోహ్లీ కి ఎంఎస్ ధోనీ తన భవిష్యత్తు ప్రణాళికల చెప్పి ఉంటాడు, ఆ విషయం కోహ్లీ సెలక్టర్లకు సమాచారం ఇచ్చే ఉంటాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. అతడిలాంటి ఆటగాడిని తయారు చేసుకోవడం అంత త్వరగా అయ్యేపని కాదని పేర్కొన్నారు. ఇండియాటుడే ప్రత్యేక కార్యక్రమంలో దాదా మాట్లాడారు. ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచకప్ తర్వాత మహీ నిరవధిక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. అతడు (మహీ) కెప్టెన్, సెలక్టర్లతో మాట్లాడే ఉంటాడు. ఆ వివరాలు చర్చించేందుకు ఇది సరైన వేదిక కాదు. ఏం చేయాలని అనుకుంటున్నాడో అది ధోనీ ఇష్టం. నాకు తెలియదు. నేను అతడితో మాట్లాడలేదు. కానీ అతడో విజేత. భారత క్రికెట్లో తిరుగులేని విజేత. వెంటనే మరో ఎంఎస్ ధోనీ మనకు దొరకడు. ఆడాలనుకున్నా, వద్దనుకున్నా అది అతడి ఇష్టం అని గంగూలీ అన్నారు.
టీమిండియా చివరిసారిగా మహీ సారథ్యంలో 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్లో సెమీస్లోనే వెనుదిరిగింది. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఏదో ఒక దశలో ఈ సమస్యను పరిష్కరించాలి. విరాట్, రవితో నేను మాట్లాడతాను. ఇది మానసిక అవరోధమైనా మరొకటైనా ఆటగాళ్లు దానిని అధిగమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పటిష్ఠ జట్టు ఉంది. కానీ సెమీస్ దశ దాటాలి. ఈ ప్రపంచకప్లో బాగా ఆడారు కానీ ఒకానొక రోజు న్యూజిలాండ్ చేతిలో ఓడారు. ఆటగాళ్లకు సామర్థ్యం ఉందని నా నమ్మకం. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. బయట నుంచి కొన్ని స్వీకరిస్తాను. సారథితో వ్యక్తిగతంగా మాట్లాడతాను. టీ20 క్రికెట్లో స్వేచ్ఛ అవసరం. ఒక బ్యాటింగ్ విభాగంగా లక్ష్యాన్ని బాగానే ఛేదిస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పుడే కొన్నిసార్లు తడబడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం అవ్వాలని గంగూలీ తెలిపారు.