రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి .క్యాసినో కేసులో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డి , సంపత్ సహా హవాలా ఏజెంట్లకు నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం ఈడీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.
చీకోటి ప్రవీణ్తో పాటు మరో ముగ్గురు లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన ఈడీ మొత్తంగా రూ.25 కోట్ల లావాదేవీలను ఈడీ గుర్తించింది.పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సైతం ప్రవీణ్, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
అంతేకాకుండా ఏడాది వ్యవధిలో 4 క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్టు గుర్తించారు. దీంతో ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్లో ప్రవీణ్ మాధవరెడ్డి క్యాసినో ఈవెంట్లు నిర్వహించారు. హవాలా ద్వారా డబ్బులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
అలాగే బేగంబజార్, జూబ్లీహిల్స్కు చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల ద్వారా నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపైనా ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు.