దిశ ఘటన, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నింటిపైనా విదేశీ మీడియా సైతం అత్యంత ఆసక్తి కనపరిచింది. ఈ ఘటనపై వరుస కథనాలను ప్రచురించింది. డాక్టర్ దిశ హత్యకు సంబంధించిన ప్రతి అంశంపైనా లండన్ లో బహిరంగంగా స్క్రోలింగ్ లను ప్రదర్శించారు. ఎల్సీడీ డిస్ ప్లేలపై వాటిని ప్రచురించారు. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద దిశ అత్యాచారానికి, హత్యకు గురి కావడం, ఈ ఘటనకు పాల్పడిన మహమ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం, వారిపై కొనసాగిన న్యాయ ప్రక్రియ, తదనంతరం ఎన్ కౌంటర్ కావడం.. ఇలాంటి పరిణామాలన్నింటిపైనా కొన్ని విదేశీ దినపత్రికలు, ఆన్ లైన్ వెబ్ సైట్లు వరుస క్రమంలో కథనాలను రాశాయి. భారత్ లో పని చేస్తోన్న కరెస్పాండెంట్ల ద్వారా ఈ ఘటనకు సంబంధించిన కథనాలను సేకరించాయి. సీఎన్ఎన్, ఇండిపెండెంట్ వంటి కొన్ని దినపత్రికలు, వెబ్ సైట్ల ఎన్ కౌంటర్ తరువాత చోటు చేసుకున్న పరిణామాలపై ఫొటోలతో సహా ప్రత్యేక కథనాలను ప్రచురించాయి.
దిశ హత్యోదంతంపై మొదట్లో విదేశీ మీడియా పెద్దగా ఆసక్తి కనపర్చలేదు. నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో అప్రమత్తం అయ్యాయి. వరుస కథనాలను ప్రచురించాయి. లండన్ లో స్క్రోలింగ్ ల ద్వారా ఈ కథనాన్ని ప్రజలకు చేరవేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా.. లండన్ వంటి కొన్ని దేశాల్లోని జంక్షన్లలో వార్తల సమాహారాలను స్క్రోలింగ్ ల ద్వారా ప్రసారం చేస్తుంటారు. దీనికోసం ప్రత్యేకంగా ఎల్సీడీ డిస్ ప్లే బోర్డులను అమర్చారు. హైదరాబాద్ ఎన్ కౌంటర్ ఉదంతాన్ని లండన్ లోని ఓ జంక్షన్ లో ప్రసారం చేశారు. హైదరాబాద్ పోలీస్ కిల్ ఫోర్ మెన్ సస్పెక్టెడ్ ఆఫ్ గ్యాంగ్ రేప్, మర్డర్.. అంటూ వరుసగా దీనికి సంబంధించిన వివరాలను ప్రసారం చేశారు. స్థఆనికులు వాటిని ఆసక్తికరంగా తిలకించడం కనిపించింది.