telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సక్సెస్‌ మీట్‌లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

ఎ.బి. సినిమాస్‌, నిహాల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై రమేష్‌ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో బలగం ఫేమ్‌ సుధాకర్‌ రెడ్డి, అంజి వల్గమాన్‌, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా రూపొందిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. తొలి ఆట నుంచే ఆర్గానిక్‌ హిట్‌ టాక్‌ను స్వంతం చేసుకుని విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుగారు మాట్లాడుతూ…
ఇటీవలే ‘బలగం’ అనే సినిమా తెలంగాణ పల్లె జీవితాన్ని, అనుబంధాల్ని కళ్లకు కట్టినట్టు చూపి, సూపర్‌ సక్సెస్‌ అయింది. అదే కోవలో ఇప్పుడు ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా విజయవంతం కావడం సంతోషంగా ఉంది. ఇందులో పల్లె ప్రజల జీవితాల్ని, వారి జీవన చిత్రాన్ని చాలా సహజంగా చూపించిన దర్శకుడు రమేష్‌ చెప్పాలకు అభినందనలు. ప్రజల ఆశలను ఆడ్డు పెట్టుకుని రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు చేస్తున్న దురాగతాల్ని ఇందులో ధైర్యంగా చూపించారు. ఇంత మంచి సినిమాను నిర్మించిన నిర్మాత బత్తిని కీర్తిలత గౌడ్‌ మా గ్రామానికి చెందిన అమ్మాయి కావడం నాకు మరింత సంతోషంగా ఉంది. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, ఔన్నత్యం, ఔచిత్యం, సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన ఇలాంటి సినిమాలను ప్రజలు తప్పకుండా ప్రోత్సహించాలి. ఈ సినిమా ఇప్పటికే మంచి విజయం సాధించింది. ఇది మరింత సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా అన్నారు.

ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…
నిజంగానే మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ప్రజల జీవన విధానాలను, వారిలోని ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకుని చక్కని కథను తయారు చేసుకుంటే సక్సెస్‌ ఖచ్చితంగా వస్తుంది అని మరోసారి నిరూపించిన అద్భుతమైన సినిమా ఇది. ఇటీవలే తెలంగాణ గ్రామీణ జీవితాల్ని ప్రతిభింబిస్తూ వచ్చిన ‘బలగం’ను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో కూడా నా దగ్గర చాలా మంది పాజిటివ్‌గా మాట్లాడారు. రియాల్టీకి దగ్గరగా ఉండే కథలు ఎక్కువగా కన్నడ, మలయాళంలోనే వస్తుంటాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఇది మన తెలుగు సినిమానేనా అనే అనుమానం కలిగింది. అంత సహజత్వంతో కూడుకుని ఉంది. మంచి కథ, నటీనటులు, టెక్నీషియన్స్‌ దొరికితే తప్పకుండా విజయం వరిస్తుంది. రాజకీయ పార్టీలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయి అనే విషయాన్ని ఇంత నిక్కచ్చిగా చెప్పడం అంటే ఆ దర్శక, నిర్మాతలకు చాలా ధైర్యం కావాలి. మేం అయితే ఈ సినిమా చేసేవాళ్లం కాదు. కానీ నిర్మాతలు డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి, దర్శకుడు రమేష్‌ చెప్పాల ఎంతో ధైర్యంతో ఈ సినిమా తీసి సక్సెస్‌ కొట్టారు. ఇందులో నటించిన అందరూ నిజంగా చెప్పాలంటే జీవించారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరించాలి అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన రాజా నరేందర్‌ చెట్లపెల్లి మాట్లాడుతూ…
ప్రేక్షకుల్ని అద్భుతంగా మెప్పించిన మంచి కంటెంట్‌ బేస్డ్‌ సినిమా అయిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’కు నిర్మాత కావడం చాలా గర్వంగా ఉంది. యూనిట్‌ మొత్తం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరూ ఇది మన సినిమా అన్న ఫీలింగ్‌తో పనిచేశారు. అందరికీ కృతజ్ఞతలు. తొలి సినిమాతోనే విజయం అందుకోవడం గర్వంగా ఉంది. నేటివిటీతో కూడిన మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవంతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.

మరో నిర్మాత డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌ మాట్లాడుతూ…
నటిగా కెరీర్‌ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవరపల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా చాలా సంతోషంగా ఉంది. తొలి ప్రయత్నమే సక్సెస్‌ కావడానికి మించిన అదృష్టం ఏముంటుంది. ఇంత మంచి కథ ద్వారా మమ్మల్ని నిర్మాతల్ని చేసిన దర్శకుడు రమేష్‌ చెప్పాల గారికి కృతజ్ఞతలు. ఈ కథను విన్నప్పుడే ఇందులో ఉన్న మెసేజ్‌ అర్ధమైంది. ఎంత మంచి కథో.. అంత మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ కూడా మాకు దొరికారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌ వారు రిలీజ్‌ చేయడంతో ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయ్యింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌ సినిమాను తన సంగీతంతో మరో లెవల్‌కు తీసుకెళ్లారు. ఇందులో నేను హీరోయిన్‌ తల్లి కూడా నటించాను. అటు నటిగా, ఇటు నిర్మాతగా నాకు మంచి పేరు తెచ్చిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’ని జీవితాంతం మర్చిపోలేను. సినిమా నిర్మాణంలోకి అడుగు పెడతున్నాను అంటే చాలా మంది సన్నిహితులు వద్దని వారించారు. కానీ ఈ కథ మీద ఉన్న నమ్మకంతో ముందడుగు వేశాము. మా నమ్మకం వమ్ము కాలేదు. అద్భుతమైన విజయాన్ని అందించారు తెలుగు ప్రేక్షకులు.

దర్శకుడు రమేష్‌ చెప్పాల మాట్లాడుతూ…
నేను దాదాపు 20 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. మనం తమిళం, కన్నడం, మలయాళం వంటి భాషల నుంచి ఎక్కువగా రీమేక్‌లు చేస్తుంటాం. అసలు మన సినిమాను వాళ్లు రీమేక్‌ చేసేలాంటి సినిమా మనం తీయలేమా అనిపించింది. సినిమా అంటూ చేస్తే.. ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచే సినిమా చేయాలని అనుకునేవాణ్ణి. అలాంటి కథే ఈ సినిమా. గ్రామీణ నేపథ్యంతో పాటు రాజకీయ పార్టీలు ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయి అనే నగ్న సత్యాన్ని వినోదంతో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలు మా సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి కథను యాక్సెప్ట్‌ చేసిన నా నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవికత అడ్డు రాకూడదని కొత్త వారితోనే చేయడం జరిగింది. అందుకే పాత్రలు మాత్రమే కనిపించాయి. మంచి ఉద్దేశంతో సమాజానికి ఉపయోగపడే బర్నింగ్‌ ప్రాబ్లమ్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

అంజి వల్గమాన్‌ మాట్లాడుతూ…
ఇలాంటి కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలో ప్రధాన పాత్రను చేసే అవకాశం రావడం అంటే నిజంగా నా అదృష్టం. దర్శక, నిర్మాతలు నన్ను నమ్మినందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. జనం అందరూ దీన్ని మంచి సినిమా, స్వచ్ఛమైన సినిమా అంటున్నారు. ప్రజలు దీన్ని మరింతగా ఆదరించి, మాలాంటి చిన్న నటీనటుల్ని, టెక్నీషియన్స్‌ను ప్రోత్సహించ వలసిందిగా కోరుకుంటున్నా అన్నారు.

ముఖ్య పాత్రను పోషించిన సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ…
బలగం తర్వాత నాకు వచ్చిన పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. సినిమా చూసిన చాలామంది ఫోన్‌లు చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కథలు మన జీవితాల్ని ప్రపంచానికి తెలియజేస్తాయి. దర్శకుడు రమేష్‌ చెప్పాల గారు ఈ కథను ఎన్నుకోవడంలోనే సగం సక్సెస్‌ సాధించారు. ఇప్పుడు సినిమా సూపర్‌హిట్‌గా నిలవడంతో పూర్తి సక్సెస్‌ వచ్చింది. సినిమాను ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు అన్నారు.

సంగీత దర్శకుడు చరణ్‌ అర్జున్‌ మాట్లాడుతూ…
ఈ సినిమా తొలి సిట్టింగ్‌ అప్పుడే ఇలాంటి కథతో రిస్క్‌ చేస్తున్నారు అన్నాను. దర్శక, నిర్మాతలకు కథమీద ఉన్న నమ్మకంతో ముందుకు వెళ్లారు. ఇవాళ సక్సెస్‌ మీట్‌ జరుపుకోవడం వెనుక వారు పడ్డ కష్టం ఏమిటో నాకు తెలుసు. కొంత గ్యాప్‌ తర్వాత నేను సంగీతం అందించిన ఈ సినిమా విజయం సాధించడం సంతోషంగా ఉంది అన్నారు.

హీరో అభిరామ్‌ మాట్లాడుతూ…
‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఒక ఆర్గానిక్‌ గ్రామీణ చిత్రం. రెండు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్వించే చిత్రమిది. నియో రియలిజం జానర్లో చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా. ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నటీ,నటులు, టెక్నీషియన్స్‌ సినిమా విజయం సాధించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నటీనటులు : అంజి వల్గమాన్‌, సాయి ప్రసన్న, సుధాకర్‌ రెడ్డి (బలగం ఫేమ్‌), రాజవ్వ, కీర్తి లత, అభిరామ్‌, రూప శ్రీనివాస్‌, బుర్ర శ్రీనివాస్‌ (బీ.ఎస్‌),శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్‌, వివ రెడ్డి, సి.ఎస్‌. ఆర్‌. నర్సింహరెడ్డి, పద్మ, మానుకోట ప్రసాద్‌, తాటి గీత, మహి, వాలి సత్య ప్రకాష్‌, మిమిక్రీ మహేష్‌, తిరుపతి, కటారి, రజిని, సుష్మా.

సాంకేతిక నిపుణులు : కెమెరా: కె.చిట్టి బాబు, సంగీతం: చరణ్‌ అర్జున్‌, సాహిత్యం: సుద్దాల అశోక్‌ తేజ, సంజయ్‌ మహేష్‌ వర్మ, ఎడిటర్‌: బొంతల నాగేశ్వర్‌ రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, పిఆర్‌ఓ: సురేశ్‌ కొండేటి, నిర్మాతలు: డాక్టర్‌ బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి, రచన-దర్శకత్వం: రమేశ్‌ చెప్పాల.

Related posts