కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం షాకిచ్చింది. గతంలో ప్రకటించిన డీఏను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గతంలో పెంచిన డీఏ, డీఆర్ ను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021, జులై వరకు పెంచిన డీఏను నిలిపివేశారు. 2020, జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిలు చెల్లింపు కూడా ఉండదని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.
2021, జూన్ 30 వరకు ప్రస్తుతమున్న డీఏ మాత్రమే కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయం వల్ల 54 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారులపై ప్రభావం పడింది. గత నెలలో పెంచిన కరువు భత్యాన్ని అమలు చేస్తే కేంద్రంపై రూ. 14,595 కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర కేబినెట్ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.