ఎం.యస్. రెడ్డి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న, షకలక శంకర్ కథానాయకుడిగా, రీతూ భర్మెచా కథానాయకురాలుగా ‘ది వన్ ఎంటర్ టైన్మెంట్స్’ బ్యానర్లో వస్తున్న చిత్రం “ఆత్రేయపురం ఆణిముత్యం” పూజా కార్యక్రమాలు లాంఛనంగా ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న నిర్మాత కె.ఎల్ దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టగా, సీనియర్ డైరెక్టర్ సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. పి. సత్యారెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా .. హీరో షకలక శంకర్ మాట్లాడుతూ.. “ఆత్రేయపురం ఆణిముత్యం నా మార్క్ కామెడీ చిత్రం. ఎమ్మెస్ రెడ్డిగారు మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కచ్చితంగా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు.
చిత్ర దర్శక నిర్మాత ఎం.యస్. రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆత్రేయపురంలో రాజు అనే యువకుడి చుట్టూ తిరిగే కుటుంబ కథా హాస్య చిత్రం ఇది. సమాజంలో జరిగే ఉమెన్ హెరాష్మెంట్ గురించి చర్చిస్తున్నాం. ఆత్రేయపురం పరిసర ప్రాంతంలో మరియు హైదరాబాద్లో చిత్రీకరించబోతున్నాం. ఈ కాన్సెప్ట్కు షకలక శంకర్గారైతే పర్ఫెక్ట్ యాప్ట్ అని ఆయన్ను తీసుకున్నాం. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ‘మా ఆత్రేయపురం ఆణిముత్యం’ అందర్నీ అలరిస్తాడు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వెంగి, డియస్ రావు, రీతూ భర్మెచా తదితరులు పాల్గొన్నారు.